ఈ పుస్తకములో వెతకండి
నేను బాలుడనైనప్పుడు పరలోకమును గొప్ప ప్రకాశమాన పట్టణముగా తలంచితిని — విశాలమైన గోడలు, గోపురములు, శిఖరములు, లోపల తెల్లని దూతలు మాత్రమే, వారందరు నాకు పరాయివారు. తరువాత నా చిన్న సహోదరుడు చనిపోయెను; అప్పుడు గోడలు గోపురములు శిఖరములు గల ఆ గొప్ప పట్టణమును, చల్లని తెలియని దూతల మందను, నాకు పరిచయమైన ఒక చిన్నవానిని తలంచితిని. ఆ దేశములో నాకు తెలిసినవాడు అతడొక్కడే. మరొక సహోదరుడు చనిపోయెను, అప్పుడు నాకు తెలిసినవారు ఇద్దరయ్యిరి. తరువాత నా పరిచితులు చనిపోవ నారంభించిరి, సంఖ్య నిరంతరము పెరిగెను. అయితే నా చిన్న పిల్లలలో ఒకని దేవునియొద్దకు పంపిన తరువాతనే, అక్కడ నాకు కొంత స్వంత వాటా ఉన్నదని తలంప నారంభించితిని. రెండవవాడు, మూడవవాడు, నాలుగవవాడు వెళ్లిరి; అప్పటికి పరలోకములో నాకు అంతమంది పరిచితులుండిరి గనుక గోడలు గోపురములు శిఖరములు ఇక నాకు కనబడలేదు. పరలోక పట్టణపు నివాసులను తలంప నారంభించితిని. ఇప్పుడు నా పరిచితులలో అంతమంది అక్కడికి వెళ్లిరి గనుక, భూమిపై కంటె పరలోకములో నాకు ఎక్కువమంది తెలుసునని కొన్నిసార్లు అనిపించును.
ఆత్మకు నివాసము. «మారని ఆ ఇల్లు నీకును నాకును సిద్ధము, అక్కడ నజరేతు యేసు నిలుచున్నాడు; సమస్త రాజ్యములకు రాజు ఆయనే నిత్యము, మన కిరీటములు ఆయన చేతులలో ఉన్నవి. ఆ సుందర దేశములో ఎంత మధురమగును, సమస్త దుఃఖము నొప్పియు లేకుండ; పెదవులపై పాటలు, చేతులలో సితారాలు ధరించి మనము మరల కలిసికొందుము.»
